కాపుల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం మాట్లాడిన మాటల మీద డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్న రాజప్ప స్పష్టత ని ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పాదయాత్రలు చెయ్యడం కుదరదు అన్నారు ఆయన.
రిజర్వేషన్ ల కోసం పోరాటం చేపట్టి పాదయాత్రలు చేస్తా అంటున్న ముద్రగాడకి ఆయన అనుమతి తీస్కోవాలి అనీ దరఖాస్తు చేసుకుంటే అనుమతిని ఇస్తాం అనీ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై ముద్రగడ ఆరోపణలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మండిపడ్డారు.
పాదయాత్రలు ధర్నాలు చేసినంత మాత్రాన కాపులు ముద్రగడ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని చినరాజప్ప వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాపులు గుర్తురాలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కాపులకు అండగా ఉందని వారి సంక్షేమానికి కాపు కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చినరాజప్ప అన్నారు. కాగా ముద్రగడ తన కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా ఏపీలోని 13 జిల్లాల కాపు జేఏసీ నేతలతో సమావేశమయిన అనంతరం ముద్రగడ పద్మనాభం తన కార్యాచరణను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 18న నల్లరిబ్బన్లు – కంచం – గరిటతో ఆందోళన చేయనున్నమని ముద్రగడ ప్రకటించారు. ఈనెల 30న ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించడం జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. పాదయాత్రకు పోలీసు అనుమతి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.తమ ఆందోళనను అణిచివేయాలని ప్రభుత్వం భావిస్తే కాపు సోదరులు ఆగ్రహానికి గురికాక తప్పదని ముద్రగడ హెచ్చరించారు.