తెలుగు దేశం ఎమ్మెల్యేకు కోర్టు షాకిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విప్, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు భీమడోలు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్పై దాడి చేశాడు. ఈ కేసులో విచారించిన న్యాయమూర్తి దీప దైవకృప శిక్షను బుధవారం (ఫిబ్రవరి 14) ఖరారు చేశారు. ఎందుకు శిక్ష వేశారు? కేసు ఏమిటంటే..
2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘటనలో చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేశారంటూ దెందులూరు పోలీస్స్టేషన్లో మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్ ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు చింతమనేనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుపై ఏడేళ్ల పాటు విచారణ సాగించిన భీమడోలు న్యాయస్థానం మంత్రిపై చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడడం వాస్తమేనని నిర్ధారించింది. చింతమనేని ప్రభాకర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తీర్పుతో ప్రభాకర్ ఆందోళనలో పడ్డాడు.
ఎమ్మెల్యే చింతమనేని మారడా.. అప్పటి కేసుకు ఇప్పుడు శిక్ష విధించగా ఎమ్మెల్యే చింతమనేని 2014 నుంచి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై పోలీసులు కేసు నమోదు చేస్తే కోర్టులు ఇంకెన్ని తీర్పులు ఇస్తాయో? ఎమ్మెల్యే చింతమనేని ఓ వీధి రౌడీలా, గూండలా ప్రవర్తిస్తుంటాడు. అతడి వ్యవహార శైలి నిత్యం వివాదాస్పదంగా ఉంటుంది. గతంలో ఓ ప్రభుత్వ అధికారిణిపై బహిరంగంగా దాడి.. ఆ తర్వాత ప్రజలపై పచ్చి బూతులు మాట్లాడడం ఇలా తదితర ఘటనలు ఎన్నో ఉన్నాయి.