తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు మరో సారి కలవనున్నారు. తెలంగాణా సీఎం కేసీఆర్ అనంతపురం జిల్లా పర్యటన ఖరారయ్యింది. ఎల్లుండి 1వ తేదీన దివంగత పరిటాల రవి, సునీతల కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహం వెంకటాపురంలో జరుగనుండగా, ఈ వివాహానికి కేసీఆర్ హాజరు కానున్నారు.
కేసీఆర్ పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో చేరుకునే కేసీఆర్, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం వెళతారు. శ్రీరామ్ దంపతులను ఆశీర్వదిస్తారు. ఇక ఇదే వివాహానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
ఇద్దరు సీఎంలు,ఇతర ప్రముఖులు హాజరవుతుండటంతో వెంకటాపురం గ్రామాన్ని ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకోగా, పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వివాహం సమయంలో కేసీఆర్, చంద్రబాబు మరోసారి కలవనున్నారని తెలుస్తోంది. అయితే, వీరిద్దరి మధ్యా ఎటువంటి అధికారిక చర్చలూ ఉండవని సమాచారం.