తెలుగు రాష్ట్రాలు ఎండలతో సతమతమవుతున్నాయి. ఈ ఏడాది మే చివరి వరకూ ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. 1973 సంవత్సరం తర్వాత ఇంతటి ఎండలు వచ్చింది ఈ ఏడాదేనని కూడా అధికారులు చెబుతున్నారు.
ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో రికార్డు అయ్యే ఎండలు ఈ సారి ఏప్రిల్ నెలలోనే తమ ప్రతాపం చూపిస్తున్నాయి. గడచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం తొమ్మిది దాటిందంటే బయటకు రావడానికి ఎవరూ సాహసించడం లేదు. 1973 సంవత్సరం ఏప్రిల్ నెల 30 తేదిన 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మార్చి 24 తేదిన కరీంనగర్ జిల్లా పైదాపూర్ లో ఏకంగా 47.33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది ఇలాగే కొనసాగితే రానున్న నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక వడ గాడ్పులు కూడా ప్రజల్ని భయపెడుతున్నాయి. ఈ సీజల్ వడగాడ్పులు మరో 45 రోజుల వరకూ ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు అగ్నిగుండంలో ఉన్నట్లుగా ఉన్నాయి. ఈ సారి అత్యధికంగా 50 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి. ఎండ వేడికి, వడగాల్పులకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క తెలంగాణ జిల్లాలోనే గురువారం నాడు వడదెబ్బ తగిలి 27 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని వొంటి పూట బడులను ఎత్తివేసి విద్యార్ధులకు సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కావాలంటే జూన్ నెలలో ముందుగానే పాఠశాలలు తెరవవచ్చునని వారు సూచిస్తున్నారు.