ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటి నుంచి ఒకింత ఒంటెత్తు పోకడలనే అనుసరిస్తున్నాడు నరేంద్రమోడీ. ఎన్నికల ముందే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడటం చేత.. తనకు ప్రజలు భారీ ఎత్తున మద్దతు ప్రకటించారనే కాన్ఫిడెన్స్ తో మోడీ పార్టీలో ఎవరినీ లెక్క చేయనట్టుగానే వ్యవహరిస్తున్నాడు.
పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని అనేక మంది నెత్తీ నోరు మోదుకొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది తమ అసంతృఫ్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు కూడా!
ఇలాంటి వారిలో ఒకరు శత్రుఘ్నసిన్హా. భారతీయ జనతా పార్టీలో ఒకానొక సీనియర్ నేతగా ఎంపీగా ఉన్నారు శత్రుఘ్న. బాలీవుడ్ లో ఒక సమయంలో స్టార్ హీరోగా వెలుగొంది రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఇతడు. అయితే మోడీ హయాంలో మాత్రం శత్రుఘ్నకు సరైన ప్రధాన్యత దక్కడం లేదు. ఈ నపథ్యంలో.. కొన్ని రోజులుగా చాలా సైలెంట్ గాఉన్నాడు ఈ హీరో. కానీ తాజాగా ఆయన ఉన్నట్టుండి వెళ్లి నితీష్ కుమార్ ను కలిశాడు. బిహార్ కే చెందిన శత్రుఘ్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెళ్లి మీట్ కావడం ఆసక్తి కరంగా ఉంది!
ఈ మీటింగ్ తో ఇప్పుడు కొత్త అనుమానాలు రేగుతున్నాయి. ఈయన భారతీయ జనతా పార్టీని వీడతాడా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదని బాధతో ఉన్న ఈ మాజీ హీరో.. ఇప్పుడు ఆ పార్టీని వీడినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రచారం జరుగుతోంది. మరి అదే జరిగితే.. మోడీ వైఖరితో బీజేపీకి నష్టం జరగడం మొదలయినట్టేనేమో!