అది బెంగాల్ సామ్రాజ్యం.. అక్కడున్న సీఎం మమతా బెనర్జీనే రారాణి. అందుకే కర్త కర్మ క్రియా అంతా ఆమెదే.. ఓ శివగామి టైపు ఇప్పుడు రెచ్చిపోయి ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. బీజేపీ అంటేనే పడని మమతా బెనర్జీ కమలం పార్టీకి లొంగను.. అవసరమైతే జైలుకు పోతానంటూ తాజాగా ప్రకటించి సంచలనం సృష్టించారు.
బీజేపీ అంటే ద్వేషమే కాదు.. ఆ పార్టీ నాయకులపై పగను సైతం పెంచుకుంటోంది దీదీ.. తాజాగా బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘెష్ పై శుక్రవారం కోల్ కతాలో పట్టపగలు గుర్తుతెలియని దుండగులు దాడి చేయడం కలకలం రేపింది.ఘోష్ మార్నింగ్ వాక్ కు వెళ్లిన సందర్భంలో ఆయనపై దుండగులు దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరి కార్యకర్తలకు ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ దాడిపై ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దీనిపై ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సీఎం మమతా సానుభూతిపరులైన తృణమూల్ నేతలే తనపై దాడి చేశారని మొత్తుకుంటున్నా ఈ విషయంలో మమత స్పందించిన పాపాన పోలేదు. ఘోష్ పై దాడి సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు అక్కడే ఉండడంతో ఆయన ఇది వారిపనేని అనుమానించారు.
ఇప్పుడే కాదు.. గత సెప్టెంబర్ లోనూ బీజేపీ బెంగాల్ చీఫ్ పై తూర్పు మిడ్నాపూర్ లో దాడి జరిగింది. ఆ విషయంలో మమతా సర్కారు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి దాడి జరిగినా ఆ కేసులో చర్యలుండవని అర్థం చేసుకోవచ్చు.