విశాఖపట్నం ఎయిర్పోర్టులో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబందించిన హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వైద్యులు. జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. జగన్ ఎడమ భుజంలోకి కత్తి బలంగా దూసుకుపోయిందని వైద్యులు తెలిపారు.
భుజానికి తీవ్ర గాయం కావడంతో డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. వైఎస్ జగన్ భుజానికి ఎనిమిది కుట్లు వేశామని వైద్యులు తెలిపారు. దుండగుడు పొడిచిన కత్తి వైఎస్ జగన్ శరీరంలోకి బలంగా దిగిందని వైద్యులు పేర్కొన్నారు. దాదాపు 4 సెంటీమీటర్ల లోతుకు కత్తి దిగిందన్నారు.
అయితే జగన్ రక్త నమూనాలను సేకరించామని వాటిని ల్యాబ్ కు పంపిచినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అలాగే దాడికి ఉపయోగించిన కత్తిని సైతం ల్యాబ్ కు పంపించామన్నారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్యం చాలా నిలకడగా ఉందన్నారు. జగన్ రిపోర్ట్స్ వచ్చే వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతామన్నారు. శుక్రవారం రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని ఆ తర్వాత డిశ్చార్జ్ పై నిర్ణయం ప్రకటిస్తామన్నారు.