వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మీదుగా సాగింది. ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. ఇది సీఎం చంద్రబాబుకు సొంత నియోజకవర్గమే. బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నది కుప్పం నియోజకవర్గం నుంచి అయినా.. ఆయన సొంతూరు నారావారి పల్లె మాత్రం చంద్రగిరి నియోజవర్గంలోనే ఉంటుంది.
ప్రస్తుతం నారావారి పల్లె పక్కనే ఉన్న శేషాపురం మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. జగన్ అక్కడ మాట్లాడారు. ఈసమయంలో బాబుపై జగన్ నిప్పులు చెరిగారు. శేషాపురంలోని స్కూల్లోనే చంద్రబాబు చదివారట. అయితే ఇప్పుడు ఆ స్కూలు శిథిలావస్థలో ఉంది.. అలాంటి బడికే పిల్లలు ఇప్పటికీ వెళ్తున్నారు. ఇలా సొంతూరినే పట్టించుకోని చంద్రబాబు నాయుడు సింగపూర్ కడతారట..’ అని జగన్ ధ్వజమెత్తారు.
నేటితో జగన్ పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ జగన్ రమారమీ 770 కిలోమీటర్ల దూరం నడిచారు. నేడు జగన్ పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గం మీదుగా సాగుతోంది. ఈజిల్లాలో జగన్కు అనూహ్యరీతిలో స్పందన వస్తోంది.