టీటీడీకి చెందిన 1,381 కేజీల బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా తరలించిన వివాదం రాజకీయ రంగు పులుము కుంటోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదలా ఉంటె తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు.1,381 కేజీల బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్నించారు.
ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎన్నికల సమయంలో ఇంత బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చిందని నిలదీశారు. భారీ స్థాయిలో బంగారం తరలింపు జరుగుతున్నా టీటీడీ అధికారులెవ్వరూ ఎందుకు లేరని సందేహం వ్యక్తం చేశారు. బాబు హయాంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేవాలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టారని, దేవుడి సొమ్మును కాజేసే నీచబుద్ధి చంద్రబాబుది అని ఆరోపించారు. సదావర్తి భూములను ఎందుకు విక్రయించాల్సి వచ్చింది? టీటీడీ బంగారం విషయంలో బాబు ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు.
టీటీడీనీ దోచుకోవడానికే తొలుత ప్రధానార్చకులు రమణ దీక్షితులను తొలగించి.. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు అర్చకులను కూడా ఇంటికి పంపించారన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించారని, ఆ తర్వాత యనమల వియ్యంకుడిని ఛైర్మన్గా నియమించారని ఎద్దేవా చేశారు. దేవుడి సొమ్మును దోపిడీ చేసేందుకే పక్కా ప్లాన్తో చంద్రబాబు వ్యవహరించారన్నారు. మీ దోపిడీలు, దొంగతనాలను మీ మనవడు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడని.. ఏదో ఒక రోజున దేవాన్ష్ మిమ్మల్ని ప్రశ్నిస్తాడని అప్పుడు మీ పరిస్ధితేంటని విజయసాయి ప్రశ్నించారు.