ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం సినీ ప్రముఖులు కలసి రావడం లేదని… ఏపీ ప్రజల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలతో ఏసీ రూముల్లో కులుకుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పోసాని మురళీకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు.
తాజాగా సినీ నటి, బీజేపీ నాయకురాలు కవితకూడా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా టాప్ హీరోనే కదా… ఆయన ఎందుకు మాట్లాడటం లేదు… ఆయన ఏ ఏసీ రూములో కులుకుతున్నారు?’ అంటూ ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేముందు మంచి, చెడ్డ చూసుకుని మాట్లాడాలని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కూడా ఒక హీరోనే అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.
హైదరాబాదులోనే ఉంటూ బానిస బతుకులు బతుకుతున్నారంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా దారుణమని కవిత అన్నారు. ఇప్పటికీ నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణిలు హైదరాబాదులోనే ఉన్నారని… వారు కూడా బానిస బతుకు బతుకుతున్నట్టేనా? అని ప్రశ్నించారు.
రాష్ట్రం విడిపోయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడకో, విశాఖపట్నానికో, రాజమండ్రికో, గుంటూరుకో, కాకినాడకో ఎందుకు షిఫ్ట్ కాలేదని… రెండేళ్లు ఆయన హైదరాబాదులోనే ఉన్నారని… మీరు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు కూడా బానిస బతుకు బతికినట్టేనా? అని అన్నారు. ముందు వెనుకా ఆలోచించకుండా మాట్లాడితే పరిస్థితులు ఇలా ఉంటాయనేది ఇప్పటికైనా నాయకులు తెలుసుకుంటే మంచిది