త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో కొత్త పొత్తు పొడిచింది. అక్కడ శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ పొత్తు కుదర్చుకున్నాయి. దీంతో పంజాబ్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో శిరోమణి అకాలీదళ్ .. ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి తప్పుకున్నది. కేంద్రమంత్రిగా ఉన్న హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్.. బీఎస్పీతో పొత్తు కుదర్చుకున్నది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్లో బీఎస్పీకి 20 సీట్లు కేటాయించారు. శిరోమణి అకాలీదళ్ 97 స్థానాల్లో పోటీచేయబోతున్నది. ఈ సందర్భంగా శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ మాట్లాడుతూ.. పంజాబ్ రాజకీయాల్లో ఇది ఒక చరిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. అయితే అకాలీదళ్ బీఎస్పీకి ఉన్న దళితుల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని పొత్తుకు మొగ్గుచూపినట్టు సమాచారం.
Also Read: యూపీ సీఎం యోగిని మార్చేస్తారా? నిజమెంత?
రాష్ట్రవ్యాప్తంగా దళితులకు 32 శాతం ఓటు బ్యాంక్ ఉంది. జలంధర్, హోషియార్పూర్, నవాన్షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితుల ప్రభావం ఎక్కువ. దీంతో ఆ సారి తమ కూటమికి తిరుగులేదని అకాలీదళ్, బీఎస్పీ భావిస్తున్నాయి.గతంలో ఎన్డీయే తో పొత్తు పెట్టుకోవడం వల్ల దళితులు తమకు దూరమయ్యారని.. వారంతా కాంగ్రెస్కు ఓటేశారని అకాలీదళ్ భావిస్తున్నది. ప్రస్తుతం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల దళితులు తమ వైపునకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటున్నది.
Also Read: బెంగాల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ.. సొంత గూటికి ముకుల్..!