పశ్చిమ బెంగాల్ బీజేపీకి కోలుకోలేని దెబ్బ పడింది. ఆ పార్టీకి కీలక నేత ముకుల్ రాయ్ గుడ్బాయ్ చెప్పారు. తాను టీఎంసీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ముకుల్ రాయ్ బీజేపీని వీడతారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అవి నేడు నిజమయ్యాయి. బెంగాల్లో బలోపేతం అవుదామనుకున్న బీజేపీకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.
నిజానికి ముకుల్ రాయ్ టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడు. చాలా ఏళ్ల పాటు మమతకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. కానీ ఆమెతో విబేధించి బీజేపీలో చేరారు. బీజేపీ కూడా ఆయనకు మంచి స్థానమే ఇచ్చింది. అయితే బెంగాల్ లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన టీఎంసీ నేత సువేందు అధికారికి ప్రాధాన్యం ఇస్తూ ఏకంగా పార్టీ శాసన సభ పక్ష నేతగా స్థానం కల్పించారు. ఇది ముకుల్ కి నచ్చలేదని సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో ముకుల్ మళ్లీ సొంతగూటికి వెళ్లడం మేలని భావించినట్టు ఉన్నారు.
Also Read: తమిళనాట చిన్నమ్మ ప్రకంపనలు.. నన్ను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరు..!
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతను ఎలాగైనా ఓడించాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. వరసగా టీఎంసీ నేతలను తమ వైపుకు తిప్పుకున్నది. మాట వినని నేతల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టింది. గెలిచేందుకు అన్ని విధాలా శ్రమించింది. కానీ ప్రజలు మాత్రం మమత వెంటే నిలిచారు.
ప్రస్తుతం సీఎం గా బాధ్యతలు చేపట్టిన మమత .. బీజేపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్లో కాస్త చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. టీఎంసీనుంచి బీజేపీలో చేరిన నేతలంతా మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముకుల్ రాయ్ కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు.
Also Read: థర్డ్వేవ్.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్ఫుల్..!