వైఎస్ జగన్కు బాసటగా వైఎస్ విజయమ్మ కూడా ఎన్నికల ప్రాచరంలోకి దిగారు. ప్రకాశం జిల్లాలోకి కందుకూరులో నిర్వహించిన రోడ్ షోలో విజయమ్మ పాల్గొన్నారు. జగన్ ఏదైనా అనుకుంటె సాధిస్తాడని ఒక్క సారి జగన్కు సీఎంగా అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తారని ప్రజలను కోరారు. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం ఎన్నికల యుద్ధం జరుగుతోందన్నారు. విలువలకు, విశ్వసనీయతకు ఓటేయాలని ప్రజలను కోరారు. వైఎస్సార్ స్ఫూర్తి, ఆశయాలతో వైసీపీ పుట్టిందని విజయమ్మ అన్నారు. వైఎస్ కుటుంబానికి, ప్రజలకు మధ్య 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు.
మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్నారు. వైసీపీ ఓట్లు రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. జగన్ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారన్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అధికారం కోల్పోయామని ఇప్పుడు అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.