వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సారి నిప్పులు చెరిగారు. గత కొద్దిరోజులుగా బాబు విజయసాయిని టార్గెట్ చేయడం తెలిసిందే. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టి పీఎమ్వో చుట్టూ తిరగడమేంటని ప్రశ్నించారు. వైసీపీ ద్వంద్వ నీతిని, నీతి బాహ్యమైన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే పీఎంఓలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.
టీడీపీ ఎంపీలతో ఈరోజు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కేంద్రంపై ఉరోపనలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఎంపీలందరూ సంఘటితంగా పోరాడాలని సీఎం సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం నోటీసు అనుమతించాల్సిందేనని, కేంద్రానికి మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు.
వృద్ధి రేటులో తెలంగాణ కన్నా ఏపీ 2 శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ… తలసరి ఆదాయంలో రూ. 33 వేలు తక్కువగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. మోదీ ప్రభుత్వంపై తెలుగువారంతా ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా సంఘటితంగా పోరాడాలని సూచించారు.