ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ మద్య ఏపిలో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సీఎం చెప్పారు.
ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఏపీలో ప్రతి రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో 62శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు నమోదవుతున్నట్టు వెల్లడించారు. వాలంటీర్, ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా శానిటైజేషన్పై దృష్టి సారించాలన్నారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి, కడప మినహా మిగతా అన్ని జిల్లాల్లో 200కుపైగా కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రానున్న మూడు వారాల్లో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వెంటనే ఏపీకి 60 లక్షల కరోనా డోసులను అందించాలని చెప్పారు.
పవన్ కళ్యాన్ కి కరోనా పాజిటీవ్…