పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గళం గట్టిగా వినిపించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సుదీర్ఘంగా టెలీకాన్ఫరెన్స్లో చర్చించి వారికి దిశానిర్ధేశం చేశారు. ఏపీకీ జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాడేందుకు అవసరమైన అంశాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సీఎం చంద్రబాబుకు వివరించారు.
పార్టీ ఎంపీలతో బాబు సుదీర్ఘంగా చర్చించారు.తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారంటూ స్వయంగా ప్రధాని మోడీ పార్లమెంట్ హౌస్ సాక్షిగా అన్న మాటను.. ఆయనకు గుర్తు చేసి.. ఎందుకు మీరు చక్కదిద్దలేదని మోడీని నిలదీయాలని, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లమని చంద్రబాబు తన శ్రేణులకు స్వేచ్ఛను ఇచ్చేశారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ పరిణామాలను గమనిస్తూ.. తాను దిశానిర్దేశం చేస్తానని.. మీరు ఆ మార్గంలో వెళ్లిపోమంటూ తెలుగుదేశం అధినేత చెప్పినట్టు తెలిసింది.
ఒకవేళ ఎంపీలను సస్పెండ్ చేస్తే.. వెనక్కు తగ్గొద్దని ఎంపీలకు బాబు గట్టిగానే సూచించినట్లు సమాచారం. ఎలాంటి పరిణామాలు ఎదురైనా కేంద్రంతో సిద్ధమై తాడో పేడో తేల్చుకోవాలని తమ పార్టీ ఎంపీలకు ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రమంతా ఢిల్లీ వైపే చూస్తున్నందున ఈ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో తమకు లాభించేలా చేసుకునేందుకు ఎంతదూరమైనా వెళ్లాలని పసుపు దళం స్కెచ్ రెఢీ చేసుకుంది
విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాజావిఫలం అయ్యిందని ప్రజా కోర్టులో దోషిగా నిరూపిస్తే వచ్చేఎన్నికల్లో భాజాపాతో అంటకాగుతున్న వైసీపీ, జనసేన కొట్టుకుపోతాయనేది చంద్రబాబు ఎత్తుగడ. దీనిలో భాగంగానే వైసీపీ, జనసేనపార్టీలపై విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ నుంచి బయటకొచ్చేసి.. పోరాడుతున్నట్టు వైసీపీ నాటకాలాడుతోందనే విషయం నిరూపించే బాధ్యతను సైతం చంద్రబాబు తన ఎంపీలకు అప్పగించారని తెలుస్తోంది. వైసీపీ పలాయనం చిత్తగించిందని, వాళ్ల రాజీనామాలను ఎవరూ పట్టించుకోకపోయినా.. ఎందుకు చేశారనే విషయం కూడా ఈ 24 రోజుల వర్షాకాల సమావేశాల్లో హైలెట్ చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది
వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో వారి వాయిస్ వినిపించే పరిస్థితులు లేవు. దీన్ని ఉపయేగించుకొని వైసీపీని దెబ్బకొట్టేందుకు బాబు వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది.ఉండవల్లి అరుణ్కుమార్ ఇచ్చిన ఆధారాలను చంద్రబాబు పంపించారు. ఈసారి నేరుగానే ఢిల్లీ వేదికగా.. మోడీ ప్రభుత్వాన్ని
సవాల్ చేసేందుకు చంద్రబాబు అన్ని రకాలుగానూ సన్నద్ధమయ్యారు.
అవిశ్వాసం విషయంపై తెలుగుదేశం మొదటి రోజు ఏ విషయం స్పష్టం చేయకపోవడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఆ పెట్టేదేదో తొలి రోజే పెట్టేస్తే.. సమయం మించిపోయాక చేతులు నలుపుకోవాల్సిన అవసరం ఉండదు కదా.. అనే విమర్శలు వస్తున్నాయి.