వైసీపీ ఫైర్బ్రాండ్ మహిళా ఎమ్మెల్యే రోజా మరో సారి చిక్కుల్లో పడ్డారు. గతంలో రోజా అనుచితంగా వ్యవహరించారంటూ ఏడాదిపాటు ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి పారేశారు.ఇప్పుడు తాజాగా మరో మారు రోజాపై చంద్రబాబు సర్కార్ కన్నెర్ర జేసింది.
రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ సందర్భంగా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళిన రోజా, స్పీకర్ కోడెల శివప్రసాద్పై సంచలన ఆరోపణలు చేశారు. టీడీఎల్పీలో జరిగిన మాక్ పోలింగ్కి స్పీకర్ హాజరు కావడాన్ని ప్రశ్నించారామె. స్పీకర్ పార్టీలకతీతంగా వ్యవహరించాలని విమర్శలు గుప్పించారు.
అయితే స్పీకర్ తీరు మాత్రం హుందాగా లేదన్నారు. ఆయనో టీడీపీ ఎమ్మెల్యే తరహాలోనే వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. గతంలో ఏ స్పీకర్ కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. విదేశాల్లో, నియోజకవర్గంలో పార్టీ మీటింగ్లలో యదేచ్చగా స్పీకర్ పాల్గొంటున్నారని విమర్శించారు.గతంలో సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్లు స్పీకర్గా వ్యవహరించారని కానీ వారు ఏనాడు ఇలా పార్టీ మీటింగ్లలో పాల్గొనలేదని రోజా గుర్తు చేశారు.
అయితే, ఈ వ్యవహారంలో రోజా అత్యుత్సాహం ప్రదర్శించారనీ, అసలు తాను టీడీఎల్పీకి వెళ్ళనే లేదని స్పీకర్ కోడెల చెబుతుండడం గమనార్హం. ఇంతకీ, రోజా ఆరోపణలు నిజమా.? స్పీకర్ చెప్పింది నిజమా.? ఏమోగానీ, అసెంబ్లీ అధికారులు విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళడంతో, రోజా నుంచి వివరణ కోరాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేసేశారు. ఇకనేం, నోటీసులు జారీ అయిపోయాయి రోజాకి అసెంబ్లీ అధికారుల నుంచి.
అసెంబ్లీలో సస్పెన్షన్ ముగిసినా, రోజా మెడ మీద ‘సస్పెన్షన్’ కత్తి ఇంకా వేలాడుతూనే వుంది. ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇవ్వడం, ఇంకొన్నాళ్ళు సస్పెండ్ చేసే దిశగా ‘వేటు’ ప్రతిపాదనలు.. ఈ తతంగం ఇలా వుండగానే, తాజా వివాదం రోజాని మరోమారు అడ్డంగా బుక్ చేసేసిందనే చెప్పాలి