చంద్రబాబు నాయుడిపై భాజాపా ప్లోర్లీడర్ విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. దేవాలయం లాంటి అసెంబ్లీనీ స్వార్థరాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలల్లో భాజాపాపై వ్యతిరేకత వచ్చేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు, పవన్ కల్యాణ్ మీటింగ్ పెట్టి ప్రశ్నించినప్పుడే ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఇప్పటి వరకూ 29 సార్లు ఢిల్లీ వెళ్లామని చెపుతున్నారు.. కానీ ఎందుకు అన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. కేవలం 11 సార్లు మాత్రమే అపాయింట్మెంట్ అడిగి, ప్రధాని మోదీని కలిశారని తెలియచేశారు. పట్టిసీమను బీజేపీ వ్యతిరేకించలేదని, ప్రాజెక్టులో జరిగిన అవినీతిని మాత్రమే వ్యతిరేకించిందని విష్ణుకుమార్ రాజు తెలిపారు.
ప్రజాపద్దుల కమిటీలో వచ్చిన ఆధారాలతోనే సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నామన్నారు. జరిగిన అవినీతిని పక్కా ఆధారాలతో నిరూపిస్తానని, అవినీతి జరగకపోతే సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. డయఫ్రాం వాల్ పేరుతో 100 కోట్లు అదనంగా ఖర్చు చేశారని, 30 పంపులకు బదులు 24మాత్రమే పెట్టారని ఆరోపించారు.
