తెలంగాణాలో కాంగ్రెస్కు విచిత్ర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరశింహ భార్య పార్టీకీ షాక్ ఇస్తూ భాజాపా తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడే ఆ పార్టీకీ ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నుండి పద్మిని రెడ్డిని పోటీకీ దింపాలని భాజాపా అధిష్టానం ఆలోచిస్తోంది.
గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం తీవ్రంగానే ప్రయత్నించినా ఆమెకు టిక్కెట్టు దక్కలేదు. ఈ దఫా కూడ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఒక్క టిక్కెట్టు మాత్రమే దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీంతో చేసేది లేక కాషాయి గూటికి చేరారు.
అయితే సంగారెడ్డి నియోజకవర్గం నుండి గతంలో తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోసారి ఇదే స్థానం నుండి జయప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ తరుణంలోనే బీజేపీలో చేరిన పద్మినిరెడ్డిని సంగారెడ్డిని బరిలోకి దింపితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి బీజేపీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. భర్త కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉంటే…. భార్య మాత్రం బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకొంది.