ఏపీలో టీడీపీ దొంగల పార్టీ అని ప్రజలందరికీ తెలిసిపోయిందని భాజాపా ఎంపీ జీవీఎల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూ.5,700కోట్లు మోసానికి పాల్పడిన.. సుజనా చౌదరి ఆంధ్రా మాల్యాగా మారారని విమర్శించారు. టీడీపీ నేతల అవినీతిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఐటీ దాడుల్లో టీడీపీ నేతల అవినీతి బయటపడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సిగ్గులేకుండా వెనకేసుకుని వస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరీ, సీఎం రమేశ్ లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తాను ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు జీవీఎల్ చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనాకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు.
టీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు చంద్రబాబు అర్రులు చాచారని ఆరోపించారు. సీట్ల పంపకంలో తేడా వచ్చి టీఆర్ఎస్తో చంద్రబాబు కలవలేకపోయారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ అంటూ చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని విమర్శించారు. అక్రమార్కులకు చంద్రబాబు మద్దతుగా మాట్లడటం సిగ్గుచేటన్నారు.
ఆంధ్రాలో తన బినామీలను కాపాడుకునే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ‘ఆలీబాబా 40 దొంగల్లా’ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని టీడీపీ నేతలు దోచేస్తుంటే బీజేపీ ప్రశ్నించకుండా ఉండాలా? అని ఘాటుగా స్పందించారు.