టీడీపీ మరో సారి ఆపరేషణ్ ఆకర్ష్కు తెరలేపుతోంది. దీంతో ప్రతి పక్షాన్ని ఒత్తిడిలోకి నెట్టేందుకు మైండ్గేమ్ను మొదలు పెట్టింది. 10 మంది వైసీపీ నేతలను టీడీపీలోకి లాక్కోవాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళగిరిలో పార్టీ నేతలతో నిర్వహించిన వర్క్ షాపులో చంద్రబాబు తన అంతరంగాన్ని వెల్లడించారు. పార్టీ తలుపులు తెరిచే వుంటాయని వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం.
వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలనుకుంటున్న చాలామంది టాప్ లీడర్లు తనతో టచ్ లో ఉన్నారని, వాళ్లు పార్టీలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు విన్నవించినట్లు ప్రచారం జరుగుతోంది. బాబుతో వారు టచ్ లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అనేది తెలియదు. ఒకరకంగా ఇదంతా టీడీపీ మైండ్ గేమ్ అనేవారు లేకపోలేదు. ఈ మైండ్ గేమ్ దెబ్బకు వైసీపీ నేతలు చిక్కితే.. క్రమ క్రమంగా ఆ పార్టీ ఉనికిని దెబ్బతీయాలనే ఎత్తుగడ దీని వెనకాల ఉన్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగడానికి కొంతమంది సీనియర్ నాయకులను చంద్రబాబు పురమాయించినట్లుగా చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో వైసీపీ నుంచి ఎవరు అవుట్ అవబోతారనే దానిపై ఆసక్తి మొదలైంది. రాజకీయ భవిష్యత్తుపై ఊగిసలాట మొదలైన వైసీపీ నేతలంతా ఈ ఆకర్ష్ వలలో చిక్కుకునే అవకాశం ఉంది. పదవుల పేరుతోను, ప్రలోభాలతోను.. మొత్తానికి నయానో, భయానో వీరందరినీ దారి తెచ్చుకోవాలనే ఎత్తుగడ టీడీపీలో కనిపిస్తోంది.
గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో పార్టీలో ఉన్న వారికి మింగుడు పడటంలేదు. ఇప్పుడు మరింత మందిని తీసుకొచ్చి పార్టీలో కూర్చోబెడితే తమ ఉనికికి ఎక్కడ ఎసరొస్తుందోనన్న ఆందోళనలో కొంతమంది టీడీపీ నేతలున్నారు. నియేజక వర్గాల పెంపు కూడా లేదని కేంద్ర స్పష్టం చేసింది.
వరుస ఓటములతో ఢీలా పడ్డ వైసీపీ ప్రత్యర్థి పట్ల జాగరుకతతో మెదలాల్సిన సందర్భమిది. పార్టీ నుంచి ఒకే పెట్టున నేతలంతా టీడీపీలో దూకినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పటికైనా జగన్.. తమ పార్టీ నేతలను అప్రమత్తం చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ జగన్ తక్షణం యాక్షన్ లోకి దిగకపోతే గనుక వైసీపీకి సమీప భవిష్యత్తులో బిగ్ డ్యామేజీ తప్పదు.