కేటీఆర్పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.భరత్ అనే నేను సినిమాలో హీరో క్యారెక్టర్ పేరును భరత్ రామ్గా మార్చేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ డబ్బులిచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని ..ఇక కేటీఆర్ యాంకరింగ్ చేసుకోవాల్సిందేనని ఎద్దేవ చేశారు.
ఇటీవల జేడీఎస్కు మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు జేడీఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చెప్పాలని వ్యాఖ్యానించారు. కర్నాటకలో స్పష్టమైన మెజారిటీ లేకున్నా దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది విమర్శించారు.
ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల పాత్రపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుందని, అయినప్పటికీ అక్కడ గవర్నర్ బీజేపీకి అవకాశం ఇవ్వడం దారుణమని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే మణిపూర్, మేఘాలయాల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటములకు గవర్నర్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని అన్నారు.
మెజార్టీ కాకుండా అత్యధిక సీట్లు గెల్చుకున్న పార్టీకి నాలుగో అవకాశం ఉంటుందన్నారు. మొదటి మూడు.. పూర్తి మెజార్టీ సాధించిన పార్టీకి, ఎన్నికల ముందు కూటమికి, ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఉంటుందన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు భారత రాజ్యాంగంపై నమ్మకంలేదని, వారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని అన్నారు. బీజేపీకి అనుకులంగా వ్యవస్థలను మార్చుకోవడమేంటని ప్రశ్నించారు.
అఖండ భారత్, సంప్రదాయ రక్షకులుగా ముద్ర వేసుకుని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నైతిక విలువల గురించి మాట్లాడే వారు.. ఎమ్మెల్యేల కొనుగొళ్లకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. సంప్రదాయాలను మీకు(బీజేపీ) అనుకులంగా మార్చుకుంటారా అని విరుచుకుపడ్డారు. ఫిరాయింపులను గవర్నర్ పరోక్షంగా ప్రొత్సహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తక్షణమే కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.