ప్రతిపక్షనేత జగన్పై దాడి, చంద్రబాబు ఢిల్లీ పర్యటన సహా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడిపై వ్యంగ్యంగా మాట్లాడిన బాబుపై విరుచుకు పడ్డారు. ఈ ఘటనపై బాబు మాట్లాడిన తీరును తప్పు బట్టారు.
జగన్ సభలకు జనాలు బాగా వస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తనపై తానే దాడి చేయించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదని ఉండవల్లి అన్నారు. జగన్ కు ఏమైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసని, కాబట్టి జగన్ ను హత్య చేయించే పని ఆయన చేయరని చెప్పారు.
నిందితుడు ఎవరి అభిమానో పోలీసులు తేలుస్తారని.. అతనికి నార్కోఎనాలసిస్ టెస్ట్ చేయించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అనవసర రాద్ధాంతం మానుకోవాలని హితువు పలికారు. జగన్పై అతని తల్లి, చెల్లి దాడి చేయించారనీ టీడీపీ నేతలు మాట్లాడటం నీచాతి నీచం అన్నారు.
వైఎస్సార్ కుటుంబానికి డ్రామాలంటే ఇష్టం ఉండదని ఉండవల్లి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ బాధ్యత లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. అసలు జగనే కావాలనే చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు.