టీఆర్ఎస్ అధిష్టానంపై తిరుగుబాటు ఎగర వేసిన ఆ పార్టీ ఎంపీ డీఎస్ సొంత గూటికి వెల్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్ పై ఎంపీ కవిత, ఇతర నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై డీఎస్ ఫైర్ అయ్యారు.
దీనిపై డీఎస్ స్పందిస్తూ మనసులో ఏదో పెట్టుకుని.. నిరాధారమైన ఆరోపణలతో తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోనివి కల్పించి.. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్పై కేసు పెట్టించారన్నారు
తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని..అలా చేసి ఉంటే వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. తాను పార్టీలో ఉంటానని కావాల్సింటే మీరే సస్పెండ్ చేయండంటూ టీఆర్ఎస్ అధిష్టానానికి లేఖ రాసి సంచలనం సృష్టించారు.
అంతేకాకుండా ఇటీవల కుమారుడు సంజయ్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆయనతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన గౌరవం దక్కకపోవడంతో బయటకు వెళ్లేందుకు డీఎస్ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజాగా కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ జరిపిన చర్చలు ఫలించాయనీ, దీనికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపిందని సమాచారం. డీఎస్ పార్టీలో చేరేందుకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో ఈనెల 11న డీఎస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. డీఎస్ తో పాటు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.