ఇన్నాళ్లు అరణ్యంలో ఒక విప్లవం కోసం.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పోరాడిన వ్యక్తి ఒక్కసారిగా జనారణ్యంలోకి వచ్చాశాడు. గుట్టుచప్పుడు కాకుండా ప్రజా జీవితంలోకి ఎందుకు వచ్చాడో ఎవరికీ తెలియదు. డీజీపీ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి ఓ సీనియర్ విప్లవ యోధుడు జనారణ్యంలోకి వస్తున్నాడని ప్రకటించాడు. ఆ తెల్లారేసరికి ఆ అన్న పోలీసుల ఎదుట లొంగిపోయి మాజీ అన్నగా అవతరించాడు.
జంపన్న అలియాస్ నరసింహారెడ్డి తన భార్య రజితతో కలిసి డిసెంబర్ 25 తెలంగాణ డీజీపీ సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. మీడియాన్నంతా పిలిచి తాను ఇన్నాళ్లు పనిచేసిన సంఘంపై విమర్శలు చేశాడు. ఇంకా వాళ్లు మారడం లేదని, తమకు బేధాభిప్రాయాలు వచ్చాయని ఈ సీనియర్ మాజీ అన్న పార్టీపై ఆరోపణలు చేశాడు. కేంద్ర కమిటీ స్థాయిలో చేసిన వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరచింది. ఏదో సాకుతో ఆయన లొంగిపోయి పార్టీని తిడుతున్నారని తెలుస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు – సీపీఐ(ఎం)) నాయకుడిగా ఎదిగిన ఆయన సొంత ప్రయోజనాల కోసం వచ్చాడని తెలుస్తోంది.
ఇప్పుడు అధికార పార్టీలో చేరడానికి సిద్ధమైపోయాడంట. ఈ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పాడు. విలేకరుల సమావేశంలో రాజకీయాల్లో చేరాలనే ఆలోచన లేదని మీడియా అడగకున్నా చెప్పాడు. తన ప్రజల్లోకి పని చేస్తున్నానని.. అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా నిరంతరం ప్రజల కోసం పని చేస్తానని పేర్కొన్నారు. అందులో భాగంగా అధికార పార్టీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని టాక్. అతడు, అతడి భార్యపై ఉన్న రివార్డు దాదాపు రూ.30 లక్షల దాకా ఉంద. ఆ తర్వాత తన రక్షణకు ప్రభుత్వ హామీ ఉంది. ఇంకా రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం కల్పించారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సడన్గా ఆయన ప్రజాజీవితంలోకి ప్రవేశించారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధ భూస్వామ్య పద్ధతి సరికాదు. ఇప్పుడు భూస్వాములు లేరు.. భూస్వామ్య వ్యవస్థ దాదాపుగా కనుమరుగవుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ఉద్యమ పంథాను మార్చుకోలేకపోతోంది’ అని జంపన్న అన్నారు. ప్రజలతో కలిసి పనిచేయడంలో మావోయిస్టు పార్టీ అనేక సమస్యలు ఎదుర్కుంటోందని, కాలానికి అనుగుణంగా మారలేకపోయిందని ఆరోపించారు. తన అభిప్రాయాలపై కమిటీతో నిర్దిష్టంగా చర్చించలేకపోయానని, అందుకే కేంద్ర కమిటీకి లేఖ రాసి బయటకు వచ్చానని తెలిపారు. తన ఆలోచనకు అనుగుణంగా పార్టీని మార్చడం సాధ్యం కాదని తెలుసుకుని సాధారణ జీవితం గడపటానికి బయటకు వచ్చానని పేర్కొన్నారు.
ప్రస్తుతం అధికార పార్టీ నాయకుల్లో ఎంతోమంది మాజీ అన్నలు ఉన్నారు. మంత్రుల్లో కూడా ఆ పార్టీలో పనిచేసిన వారు ఉన్నారు. అందుకే అధికార పార్టీ చొరవ తీసుకొని ఈ విధంగా రాబట్టింది. అదే విధంగా వరంగల్లో బలోపేతం కావడానికి అతడిని ఉపయోగించుకోవాలని చూస్తోంది.
అయితే ఒక్కసారి పార్టీలో నుంచి బయటకు వచ్చిన నాయకులకు ప్రాణహాని పొంచి ఉంటుంది. అది పోలీసుల నుంచి కావొచ్చు.. తాను పనిచేసిన పార్టీ నుంచి అయినా కావొచ్చు. అందుకే ఇవన్నీ ఆలోచించుకొని పక్కా ప్రణాళికతో జన జీవన స్రవంతిలోకి వచ్చాడని తెలుస్తోంది. అధికార పార్టీలో చేరితే తన ప్రాణానికి రక్షణతో పాటు పదవులు వస్తాయనే ఆశతో బయటకు వచ్చారని చర్చ జరుగుతోంది.
