ఏపీలో అధికారపార్టీ టీడీపీ నేతల అక్రమాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. అందిన కాడికి ప్రపల సొమ్మును పంది కొక్కుల్లా దోచుకుతింటున్నారు. ప్రతీ వ్యవస్థలోను అవినీతి రాజ్యమేలుతోంది. ఇసుకమాఫియా, అధికారులపై దౌర్జన్యాలు, ల్యాండ్ మాఫియా, అమరావతి పేరుతో విచ్చల విడిగా అందిన కాడికి దోచుకుతింటున్న సంగతి తెలిసిందే.
అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖరే ఇలా ఉంటే… విపక్షం వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఆ తర్వాత లోపాయికారీ ఒప్పందాల మేరకు అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరింతగా చెలరేగిపోతున్నారన్న వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీలో ఉన్నంత కాలం తమ నియోజకవర్గాలకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదని చెబుతున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు… పార్టీ మారిన తర్వాత పెద్ద ఎత్తున పనులు మంజూరవుతుండటంతో ఆ నిధులను దోచుకొనేందుకు సిద్దమవుతున్నారు.
తాజాగా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఎస్సీ – ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు వేసేందుకు సబ్ ప్లాన్ కింద రూ.11.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను రాష్ట్రానికి చెందిన ఏ కాంట్రాక్టర్ అయినా టెండర్ వేయవచ్చు. కాని అలా జరగకుండా ఆ కాంట్రాక్టును తన అనుయాయులకు దక్కించు కొనేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పెద్ద ప్లాన్ వేశారంట. బయటి కాంట్రాక్టర్ల ఎంట్రీని అడ్డుకునేందుకు గాను పనులు చేసే ప్రాంతానికి 40 కిలో మీటర్ల పరిధిలో కాంక్రీటు బ్యాచింగ్ పాయింట్ ఉండాలంటూ ఓ కొత్త నిబంధన పెట్టేసి టెండర్లు పిలిచారు. ఈ నిబంధన కారణంగా ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండరు వేసేందుకు వీలు లేకుండా పోయింది. కేవలం అశోక్ రెడ్డి సూచన మేరకు గిద్దలూరులోనే తొలిసారిగా ఈ కొత్త నిబంధనను పెట్టారట.
కాంట్రాక్ట్ టెండరు జారీ చేసి బయటి కాంట్రాక్టర్లకు చెక్ పెట్టేసిన ఎమ్మెల్యే.. ఆ తర్వాత ఓ మంత్రికి చెందిన అల్లుడితో గిద్దలూరు సమీపంలో కాంక్రీటు బ్యాచింగ్ పాయింట్ ను ఏర్పాటు చేయిస్తున్నారట. ఈ పాయింట్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే టెండరు నోటిఫికేషన్ జారీ అయిపోవడంతో కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనను ఆసరా చేసుకుని ఒకే ఒక్క టెండరు దాఖలయ్యేలా ఎమ్మెల్యే చక్రం తిప్పారట.
దీంతో మొత్తం రూ.11.50 కోట్ల విలువ చేసే పనులు ఎమ్మెల్యే వర్గానికే దక్కడం ఖాయమైపోయిందట. అయినా ఎవరు చేసినా పని పూర్తవుతుంది కదా అంటే… కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఉంటే… ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే తక్కువ ధరకే పనులు పూర్తి అవుతాయనేది అందరికి తెలిసిందే. అలా కాకుండా సింగిల్ టెండర్ వచ్చిందంటే… ఎక్సెస్ టెండర్లతోనూ పనులు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వం మీద అదనపు భారం పడుతుంది. ఈ కొత్త నిబంధనతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎంత లేదన్నా… రూ.3.50 కోట్లను అప్పనంగా జేబులో వేసేసుకుంటున్నారని అక్కడి జనం మాట్లాడుకుంటున్నారు.