ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. జగన్ పిటిషన్ విచారణకు అర్హత ఉందా లేదా అనేది రేపు నిర్ణయిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తమముందు ఉంచాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది.
తనపై హత్యాయత్నం కేసుకు సంబంధించి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హైకోర్టు లో పిటిషన్ ను దాఖలు చేశారు. థర్ట్ పార్టీ విచారణను జగన్ కోరారు. ఏపీ పోలీసులపై నమ్మకం కూడ లేదని పిటిషన్లో కోరిన సంగతి తెలిసిందే.జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేసును తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించారని ఆరోపించారు.
అయితే ఆ ఆరోపణలను ఖండించిన ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్.. పోలీసుల విచారణకు జగన్ సహకరించడం లేదని తెలిపారు. పోలీసులకు సహకరించాల్సిందిగా పిటిషనర్ ను ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
అక్టోబర్ 25న విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన జగన్ హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నారు.