మాటలు మార్చడంలో చంద్రబాబును మించిపోయారు జనసేనాని నాయకులు. ఇతర పార్టీల నుంచి అంతమంది వస్తున్నారు..ఇంత మంది వస్తున్నారని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు పవన్ బాబు, జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదిలా ఉంటే మరో సారి మాటతప్పింది జనసేన పార్టీ.
గతంలో తమకు 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వాల్లంతా ఎప్పుడైనా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పవన్ ఘనంగా ప్రకటించారు. జనసేన తరఫున టీవీలో వకల్తా పుచ్చుకుని మాట్లాడే నేతలు ఈ ప్రకటనలు చేశారు. మరి వారిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ జనసేనలోకి చేరారో తెలిసిన సంగతే.
వివిధ పార్టీల్లో పనిచేస్తూ.. అక్కడ తమకు అవకాశం దక్కదని అర్థం చేసుకున్న కొంతమంది నేతలు మాత్రం ఇప్పటి వరకూ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనే ఆశ మాత్రమే ఉన్నవాళ్లు తెలుగుదేశం, వైకాపాల్లో టికెట్ లభించే అవకాశాలు లేని నేపథ్యంలో జనసేనలోకి చేరుతున్న వైనాలను అంతా గమనిస్తున్నారు.
అయితే తాజాగా మరోసారి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆపార్టీ కన్వీనర్ పార్థసారథి సంచలన ప్రకటన చేశారు. అంటే 40 నుంచి ఇరవై స్థాయికి వచ్చారనమాట. నలభై మందిలో ఎంతమంది చేరారో కానీ.. ఇప్పుడు ఇరవై మంది అంటున్నారు. రేపు ఎంతమంది అంటారో చూడాలి.