జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పర్యటన మూడు విడతలుగా ఉంటుందని ప్రకటించారు. తన మొదటి పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన చేస్తానని చెప్పారు. రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని అన్నారు. ఇక సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాల వేదికగా మూడో విడత పర్యటన ఉంటుందని చెప్పుకొచ్చారు.
మొదటగా ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టారు. అక్కడ మూడు రోజుల పర్యటన చేపట్టనున్నారు. గతంలో ఎప్పుడో పవన్ ఉథ్థానంలో కిడ్నీ బాధితుల పేరిట శ్రీకాకుళంలో పర్యటించారు. తాజాగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగి శంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగి కుటుంబాన్ని కూడా పవన్ పరామర్శించనున్నారు.
ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత పవన్ ప్రకాశం జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై తరచూ పవన్ పర్యటనలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర అభివృద్ధిపరంగా బాగా వెనుకబడిన ప్రాంతం కావటంతో పవన్ వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్రనే ఎన్నుకున్నట్లు కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం యువత నిరాశతో ఉందని, యువతను జాగృతం చేసేందుకు ‘చలో రే చలో’ గీతాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఇక తెలంగాణాలో ముందుగా ఓయూలో ఆత్మహత్య చేసుకున్న మురళీ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం ఉన్న పోలీస్ ఆంక్షలు సడలించిన తర్వాత పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తానని తెలిపారు.
ఇప్పటికే ఉద్ధానం బాధితుల కోసం విశాఖపట్నం వచ్చిన పవన్.. ఈసారి తన పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రంపై కూడా ఘాటుగా స్పందించే అవకాశాలున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా పవన్ పర్యటన కొనసాగనుందని తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తన మొదటి పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన చేస్తానని చెప్పారు. రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని అన్నారు. ఇక సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాల వేదికగా మూడో విడత పర్యటన ఉంటుందని చెప్పారు.