వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్తులపై దృష్టి పెట్టారు. రిపబ్లిక్ సర్వే ఫలితాల్లో కూడా వైసీపీకీ 19 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీనీ ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్తుల వేటలో పడ్డారు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి ప్రముఖ సినీనటి వైసీపీ తరుపున బరిలో దిగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీనుంచి మురళీమోహన్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రముఖ సినీనటి జయప్రద త్వరలో వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. సినీనటిగానే కాకుండా జాతీయంగా గుర్తింపు కలిగిన తెలుగు మహిళానేత. టీడీపీ వ్వవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు పిలుపు మేరకు 1994 ఎన్నికలకు ముందుగానే రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద… ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేసినా సున్నితంగానే తిరస్కరించారు.
1996లో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన జయప్రద బాబుతో విబేధాల కారణంగా… టీడీపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన జయప్రద… గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
తన రాజకీయ భవిష్యత్తుకు వైసీపీ తనకు సరైన పార్టీగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే జగన్తో బేటీ కానున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి ఆమె వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమేనని సమాచారం. జయప్రద సొంతూరు రాజమహేంద్రవరమే కావడం మరింత కలసి వచ్చే అంశం.
పాదయాత్రలో ఈసారి రాజమండ్రి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. జయప్రద కూడా బీసీ కావడంతో టికెట్ విషయంలో ఇబ్బందులు ఉండవన్నమాట. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగా టీడీపీ సీనియర్ నేత సినీ నటుడు మాగంటి మురళీమోహన్ కొనసాగుతున్నారు. ఆర్థిక పరంగా కూడా బలమైన నేత కావడంతో ఆయనను జయప్రద మాత్రమే ఢీకొట్టగలిగే సత్తా కలిగిన నేతను నిలబెట్టినట్టవుతుందన్నది జగన్ భావనగా తెలుస్తోంది. అంతేకాకుండా జయప్రదను రాజమహేంద్రవరం నుంచి బరిలోకి దించితే… మొత్తం తూర్పు గోదావరి జిల్లాతో పాటుగా ఆ జిల్లా సరిహద్దు జిల్లాలపైనా కొంత మేర పట్టు సాధించవచ్చన్నది జగన్ భావనగా తెలస్తోంది.