మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుతారంటూ జరుగుతున్న ప్రచారంపై పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. హైదరాబాద్తో సహా ఏ నగరాన్ని యూటీ చేసే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్లో నిర్వహించిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ సీటును భాజపా గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం టి.ఆర్.ఎస్ అపవిత్ర పొత్తును ఊరూరికి తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మ ఘోసించేలా కేసీఆర్ వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు.
అబద్ధాలు ప్రచారం చేయడం టీఆర్ఎస్, ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు. దీనిపై సమాధానం చెప్పే లోపు అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాదును కేంద్రం యూటీగా చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
కాగా, అంతకుముందు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో మాట్లాడుతూ, హైదరాబాద్ యూటీ అంశాన్ని లేవనెత్తారు. జమ్మూకశ్మీర్ అంశంపై ఒవైసీ మాట్లాడుతూ, హైదరాబాదును కూడా ఇదేవిధంగా యూటీ చేస్తారంటూ అనుమానం వెలిబుచ్చారు.