తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నట వరకు టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు కోదండరామ్ వచ్చారు. కోదండరామ్పై అధికార పార్టీ ఎప్పుడూ ఎక్కువగా విమర్శలు చేయలేదు. తాజాగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నర్సంపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. నాడు తెలంగాణ ఉద్యమసమయంలో యువత అమరులు కావడానికి కారణమైన వారితో ఆ పార్టీ పొత్తు పెట్టుకుందని, ఏ అమరుడు చెప్పాడని కాంగ్రెస్, టీడీపీతో కోదండరామ్ పొత్తు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మర్యాదగా ఇచ్చిందా? వీపు చింతపండు అవుతుందనే భయంతోనే ‘తెలంగాణ’ ఇచ్చిందని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అమనుతులు ఇవ్వొద్దని కేంద్రానికి చంద్రబాబునాయుడు ముప్పై లేఖలు రాశారని, అలాంటి చంద్రబాబుతో కోదండరామ్ ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు.
అది మహాకూటమి కాదని స్వాహా కూటమి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొరపాటును ఈ కూటమి అధికారంలోకొస్తే అమరావతికి తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉండాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.