భయంకరమైన తిట్ల వర్షం కురిపించుకున్న ఫ్లాష్ బ్యాక్ మొత్తం మరిచిపోయి సోనియా దేవత, రాహుల్ దేవుడు అంటూ కాంగ్రెస్ వెంటపడుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబును ఘోరంగా అవమానిస్తున్నారు. తగుదునమ్మా అంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును ఖర్చుచేస్తూ స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నారు బాబుగారు. ప్రజల కోసం ఏమైనా చేయాల్సి వస్తే కడు పేద రాష్ట్రం అంటూ కన్నీరు కార్చే బాబుగారికి స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతూ తన కోసం స్వార్థ రాజకీయాలు చేయడానికి మాత్రం ఖజానాలో నిండుగా నిధులు కనిపిస్తూ ఉంటాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నప్పటికీ బాబుకు మాత్రం అవేం పట్టడం లేదు.
అయితే ఆంధ్రప్రదేశ్ ఖజానాను ఖల్లాస్ చేస్తూ కాంగ్రెస్ ప్రాపకం బాబు నానా పాట్లూ పడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబుకు అవమానాలు మిగులుస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నేత కమల్నాథ్ కూడా చంద్రబాబును ఘోరంగా అవమానించాడు. ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపైనే సంతకం చేశాడు కమల్ నాథ్. ఆ వెంటనే దేశంలోని వేరే ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా ఇంత భేషరతుగా రుణమాఫీ చేశాడా? మాట ఇచ్చినట్టుగా రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం చేశాడా? అంటూ తనదైన శైలిలో బిజెపి ముఖ్యమంత్రులను ప్రశ్నిస్తున్నాననుకుని ప్రసంగం దంచిపారేశాడు. అయితే ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉత్సాహంగా వెళ్ళిన బాబు బ్యాచ్కి మాత్రం కమల్ నాథ్ మాటలు గట్టిగా తగిలాయి. అక్కడే ఉన్న నేషనల్ మీడియా జనాలందరూ కూడా బాబు వ్యవహారం గురించి ప్రస్తావిస్తూ సెటైర్స్ వేయడం, నాయకులు నవ్వుకోవడం లాంటి సంఘటనలు జరగడంతో పచ్చ బ్యాచ్ మొహాలన్నీ మాడిపోయాయి. భేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని, మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపైనే చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు ఘోరంగా అవమానించిన విషయం అందరికీ తెలిసిందే కదా.
అప్పట్లో సోనియా, రాహుల్లు కూడా ఈ విషయంపై చంద్రబాబును విమర్శించారు. ఇప్పుడు కమల్ నాథ్ రైతులకు మాట ఇచ్చినట్టుగా మొదటి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపైనే సంతకం చేయడం, అలా చేయకుండా మాటతప్పిన ముఖ్యమంత్రులను విమర్శించడంతో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును ఘోరంగా అవమానించిందని టిడిపి నేతలే వ్యాఖ్యానించడం వినిపించింది. అఫ్కోర్స్…….తాను అధికారంలోకి రావడానికి అవసరం అనుకుంటే ఇలాంటి అవమానాలను దిగమింగడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అవసరం అనుకున్నంత కాలం మోడీ దగ్గర ఏ స్థాయిలో సాగిలపడ్డాడో చూశాంగా. ఇప్పుడు సోనియా, రాహుల్ల ప్రాపకం కోసం అదే స్థాయిలో శరణుజొచ్చుతున్నాడు. కాకపోతే ఇలాంటి నాయకుడు తెలుగోళ్ళ ఆత్మగౌరవం నిలబెడతాడు అని పచ్చ మీడియా ప్రచారం చేస్తూ ఉండడమే ఎబ్బెట్టుగా ఉంటోంది అన్నది విశ్లేషకుల మాట. కాదంటారా?