టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజకీయ అజ్ఞానం మరోసారి బయట పడింది. తన వ్యాఖ్యలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని చూసి మరోసారి తేలిపోయాడు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు లో సోమవారం ప్రవేశపెట్టిన 2021 బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ కు ఒరిగింది ఏమీ లేదని తేటతెల్లం అయింది. బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కలగడం లేదంటూ అన్ని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా కామెంట్ చేయాలని భావించారు.
అయితే మోదీ ప్రభుత్వాన్ని మాట మాత్రమైనా అనడానికి లోకేశ్లో ధైర్యం లేదని ఆయన ట్వీట్ ప్రతిబింబిస్తోంది. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనేందుకు దమ్ము, ధైర్యం లేని టీడీపీ యువకిశోరం లోకేశ్ … ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ట్వీట్ల తూటాలు పేల్చడానికి మాత్రం ముందు వరుసలో నిలిచారు. లోకేశ్ వరుస ట్వీట్లను ఓసారి చూస్తే..
‘జనాన్ని మోసం చేసే రెడ్డి.. జగన్ రెడ్డి మరోసారి రాష్ట్రాన్ని దగా చేశారు. 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సాధిస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి.. తన 31 కేసుల నుంచి తప్పిస్తే చాలు ప్రత్యేక హోదా ఊసెత్తనని 28 ఎంపీల్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హామీలకు బాబాయ్ హత్య కేసుతో చెల్లు చేసింది కేంద్రం సర్కారు.
బడ్జెట్లో నిధులు కేటాయించక్కర్లేదు కానీ, సహనిందితులైన అధికారులను తనకు కేటాయిస్తే చాలని కేంద్రం వద్ద సాగిలపడ్డారు జగన్ రెడ్డి. అప్పులు వాడుకోవడానికి అనుమతిస్తే చాలు.. ఏ ప్రాజెక్టులివ్వకపోయినా ఫర్వాలేదని ఒప్పందం చేసుకున్నారు. బడ్జెట్లో ఏపీకి ఏమీ ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అనలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు జగన్ రెడ్డి’ అంటూ లోకేశ్ సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు.
కేంద్రం మొండి చేయి చూపింది అని చెప్పడానికి లోకేశ్ ఎన్నెన్ని వంకర్లు తిరిగారో పైన పేర్కొన్న ట్వీట్ చదివితే అర్థమవుతుంది. సీఎం వైఎస్ జగన్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి , ఆయన్ను మాత్రమే విమర్శిస్తే తన బాధ్యత తీరిపోతుందని లోకేశ్ భావిస్తున్నారా? అని నెటిజన్లు ఎత్తి పొడుస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ 2021: సీనియర్ సిటిజన్లకు శుభవార్త
కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు