మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అసలే కరోనా వైరస్ తో నానా తంటాలు పడుతున్న జనాలకు ఇప్పుడు కొత్తరకం కరోనా మరింతగా భయపెడుతుంది. బ్రిటన్ లో మొదలైన ఈ కొత్తరకం కరోనా వైరస్ మరింత బలమైనదని.. దీని వల్ల ప్రాణాలకు మరింత ముప్పు ఉందని తెలియడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటి వరకు 18 మంది కరోనా వైరస్ బారినపడినట్టు నిర్ధారణ అయింది.
విమానాశ్రయంలో చేస్తున్న ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వీరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మంగళవారం 16 మందికి నిర్ధారణ కాగా, 11, 13 తేదీల్లో ఇద్దరికి వైరస్ సంక్రమించినట్టు పరీక్షల్లో తేలింది. గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరికి వైరస్ కొత్త స్ట్రెయినా? లేద సాధారణ వైరస్సా అన్నవిషయం తెలియాల్సి ఉంది. కాగా, గత నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్ సహా వివిధ దేశాల నుంచి తెలంగాణకు మూడువేల మందికిపైగా వచ్చినట్టు కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది.
పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సీ ల్యాబ్కు పంపాలని ఆదేశించింది. వాటిలో వైరస్ తీవ్రను తెలుసుకునేందుకు పూణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపాలని సూచించింది. బ్రిటన్ నుంచి వచ్చి కరోనా వైరస్ కొత్త జాతి బారినపడిన వారిని టిమ్స్లో చేర్చి, వారితో కాంట్రాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు మాత్రం అమీర్పేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.