కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సినిమా థియేటర్లను మూసి వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సీటింగ్ కెపాసిటీని అన్ లాక్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాల మేరకు 50 శాతానికి తగ్గించాలని కూడా అధికారులు సూచించారు. సినిమా హాల్స్ లో మాస్క్ లను ధరించకుండా, పక్కపక్కనే కూర్చోవడం, తలుపులు మూసివేసి, ఎయిర్ కండిషనింగ్ అమలు చేస్తుండటం కూడా కేసులు పెరగడానికి కారణమని అధికారులు తమ నివేదికలో అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే విద్యావ్యవస్థలు అన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు మూసి వేస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ… థియేటర్లు బంద్ చేస్తారన్న ప్రచారంలో నిజంలేదని చెప్పారు. సినిమా థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
థియేటర్ల యజమానులు సినిమా హాళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించేలా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. థియేటర్లను మూసివేస్తారంటూ వస్తోన్న ప్రచారాన్ని నమ్మకూడదని ఆయన ప్రజలకు సూచించారు.