వైసీపీ సీనియర్ నేతపై అధిష్టానం వేటు వేసేందుకు రంగం సిద్దమయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సదరు నేత గతంలో కూడా వంగవీటి రంగపై చేసిన వ్యాఖ్యల ఫలితంగా పార్టీ సస్పెండ్ చేసింది. కొద్దిరోజుల అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయడంతో మరో సారి పార్టీలోకి వచ్చారు. తాజాగా ముస్లింలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరో సారి నేతపై వేటు వేసేందుకు రంగం సిద్దమయ్యింది.
వైసీపీకి మొదటి నుంచి ముస్లింలు మద్దతుగా నిలుస్తున్నారు. వైఎస్ఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు ముస్లింలు జగన్కే మద్దతు ఇస్తున్నారు. అలాంటి పార్టీలో ఉండి ముస్లింలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు..విజయవాడకు చెందిన కీలకనేత గౌతమ్ రెడ్డి. ఇటీవల ఓ చానల్లో ముస్లిం మహిళల మనోభావాలను కించ పర్చే విధంగా గౌతమ్రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషియల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగన్ సీరియస్గా తీసుకున్నారంట. ఆయన ఆదేశాల మేరకు ఈ అంశంపై విచారణ జరిపిన క్రమశిక్షణ సంఘం గౌతమ్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని వైసీపీ క్రమశిక్షణ సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులకు ఆయన వివరణ ఇచ్చిన తర్వాత సస్పెన్షన్ వేటుకు పార్టీ అధిష్టానం సిద్దమవుతోంది.