ప్రధాని మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన భాషను వ్యతిరేకిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ధానిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఏం కావాలని ప్రశ్నించారు. మేము ప్రధానిని వ్యతిరేకిస్తాం. భాష హుందాగా ఉండాలి. కేసీఆర్ భాషను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ సమాజం అంగీకరించదని అన్నారు.
శుక్రవారం పార్లమెంట్ వద్ద రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను ఉద్దేశించి సైతం కేసీఆర్ అసభ్యంగా మాట్లాడారని అన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి తెలంగాణదని గుర్తు చేశారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని హితవుపలికారు.
కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తారనుకుంటే ఫామ్ హౌస్ కే సీఎం పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తేనే విభజన చట్టంలోని హామీల అమలు సాధ్యమని చెప్పారు.