గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన నేతల పరిస్థితి దారునంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాలకు ఆశపడి సుమారు 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఒక సంవత్సరం పాటు సాఫీగానే సైకిల్లో కాలం గడిపారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫిరాయించిన నేతలను పార్టీలో ఎవరూ లెక్కచేయడంలేదు.
తాజాగా కర్నూలు ఎంపీ బుట్టారేణుకకు పరాభవం తప్పలేదు. గతంలో బుట్టా రేణుక వైసీపీలో ఉన్నప్పుడు అడుగు వేస్తే ఇసుక వేసినంత ప్రజా మద్దతు ఉండేది కానీ ప్రస్తుతం ఆమె టీడీపీలోకి ఫిరాయించడంతో నూటికి ఇరవై శాతం కూడా ప్రజా మద్దతు లేదని తెలుస్తోంది. దీంతో పాటు టీడీపీ నేతల నుంచి కూడా ఆమెకు ఎలాంటి మద్దతు లభించడంలేదు.
తాజాగా ఎంపీ నిధుల కింద మంజూరైన మినీ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి బుట్టా రేణుక ఎమ్మిగనూరుకు వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ఒక్క టీడీపీ నేత కూడా హాజరు కాకపోవడంతో షాకవ్వడం ఆమె వంతుఅయింది. దీంతో కేవలం బుట్టా రేణుక ఒక్కరే కార్యక్రమంలో పాల్గొని.. త్వరత్వరగా తన పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే టీడీపీలో చేరిన ఆమెకు పార్టీ నేతలు సహకారం అందడం లేదన్నట్లు కనిపిస్తోంది.
కానీ ఫిరాయింపుల విషయంలో మాత్రం జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితులో వారిని వైసీపీలోకి తిరిగి ఆహ్వానించేది లేదని గట్టి నిర్ణయం తీసుకున్నారు.ఇక ఆయన నిర్ణయంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ తదుపరి కార్యచరణకు సంబంధించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.