నారా లోకేష్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ పై టిడిపి పరువునష్టం దావా వేస్తుందా? ..అన్న వార్తలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా పవన్కల్యాణ్పై పరువు నష్టం దావా వేసే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారాయి.
తమకు పవన్ కల్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదని… ఏపీ ప్రజలకు ఎవరేంటో తెలుసని చెప్పారు. పవన్ దిగజారుడు రాజకీయాలు బాధాకరమని… ఆయన వద్ద తన ఫోన్ నంబర్ ఉందని… ఏవైనా ఆధారాలు ఆయన వద్ద ఉంటే నేరుగా తనకే ఫోన్ చేసి ప్రశ్నించి ఉండొచ్చుకదా అని అన్నారు. తాము ప్రతి ఏటా ప్రకటిస్తున్న ఆస్తుల కన్నా చిల్లిగవ్వ ఎక్కువున్నా తీసుకోండని చెప్పారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి లోకేష్ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదంటూ పలువురు టీడీపీ నేతలు పవన్ పై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా అసత్య ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన పవన్కల్యాణ్పై పరువు నష్టం దావా వేయాలని కొందరు నేతలు సూచించారని సమాచారం. ఈ నేపధ్యంలోనే పరువునష్టం దావా అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.