తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు కష్టకాలం వచ్చినట్టే. దీనికి అనుగుణంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ పలు మార్లు చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు బాగా లేదని వచ్చింది. సర్వే ఫలితాలు కేసీఆర్ను ఆందోళనలో పడేట్టు చేస్తున్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్పై ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉంది. కానీ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి ఉందని తెలిసింది. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో అసంతృప్తి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండేట్టు కనిపిస్తోంది.
ప్రభుత్వ పనితీరు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉంది. కొందరు ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ నిఘా విభాగాల ద్వారా సీఎం కేసీఆర్కు ఈ సమాచారం చేరింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సొంతంగా 63 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టింది. ఆ తర్వాత మూడేన్నరేళ్లల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ప్రస్తుతం టీఆర్ఎస్ ఏకంగా 88 ఎమ్మెల్యేలకు చేరింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్గూలో చేరారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు ఎంపీలు కూడా పార్టీ మారారు. జంప్ జిలానీలుగా ముద్రపడిన ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో కష్టకాలమే అని తేలింది.
ఏదో అవసరాల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉండకపోవడం.. ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం తదితర కారణాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఎక్కువగా అసంతృప్తి కనిపిస్తోందని సమాచారం. మరీ దీనిపై సీఎం కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకే మళ్లీ అవకాశం ఇస్తామని చెప్పారు. మరీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా అదే అవకాశం ఇస్తారో లేదా వేచి చూడాలి.