తెలంగాణా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసును కేసీఆర్ సమీక్షించిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసు అడ్డం పెట్టుకొని నాపై కుట్రలు పన్నుతున్నారని రేవంత్ ఆరోపించారు. మోదీ, కేసీఆర్ డ్రామాలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
ఎన్డీయే నుంచి చంద్రబాబు వైదొలగడంతో మోదీకి ఇబ్బందులు వచ్చాయని… దాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే కేసును ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని… అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు.
రాజకీయ కక్ష సాధింపుతోనే ఇదంతా చేస్తున్నారని… అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని రేవంత్ ఆరోపించారు.కేసీఆర్ రాష్ట్రంలో విస్తృతంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, నాలుగేళ్లలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు.
లంచం అడిగితే చెప్పుతో కొట్టాలన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కిన అధికారి సంజీవరావును ఇంకా పదవిలో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఏసీబీ, ముఖ్యమంత్రి వ్యవహార శైలి సరిగా లేదని అన్నారు. తెలంగాణ ఏసీబీ 2016లో 125 కేసులకు ఆధారాలు లేవంటూ వాటిని మూసేసిందని చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వెల్లడించిన నివేదికలో ఈ విషయం ఉందని తెలిపారు.