మహా కూటమి తరుపున టీ టీడీపీ జాబితా విడుదలపై ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు అభ్యర్తుల పేర్లను ప్రకటించలేదని న్యూస్ ఛానల్లలో వచ్చిన వార్తలు ఊహాగానేలనని తెలిపారు.మహాకూటమిలోని పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని, పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు.
ఇదలా ఉంటే మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటిస్తారంటూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆశావహులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. రెండుమూడు స్థానాల్లో ఇతర పార్టీలతో ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాబితా ప్రకటన మంగళవారం ఉంటుందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
గత అనుభవాల వల్లే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని, గత సంప్రదాయాలకు భిన్నంగా ఈ సారి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని రమణ తెలిపారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూటమి నేతలంతా కలిసి ఒకే వేదికపై అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.