టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను రమణ కూడా ఖండించలేదు. ఇదిలా ఉంటే రమణ .. రేపు జగిత్యాలకు వెళ్లబోతున్నారు. అక్కడ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై టీఆర్ఎస్లో చేరే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. టీఆర్ఎస్లో చేరాలని ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. రేపు కార్యకర్తలతో ఈ విషయాన్ని చర్చించనున్నారు.
మరోవైపు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంతో.. ఆయన స్థానాన్ని రమణతో భర్తీచేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు స్పష్టమైన హామీ వచ్చాకే రమణ పార్టీ మారబోతున్నట్టు సమాచారం.గతంలో టీడీపీలో కీలక నేతగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాసయాదవ్ ఈ విషయంలో మధ్యవర్తిత్వం నడిపినట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read: జూనియర్ ఎన్.టి.ఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య రియాక్షన్ ఇదే..!
ఈ క్రమంలో రేపు రమణ జగిత్యాల వెళ్లడం ఆసక్తికరంగా మారింది. జగిత్యాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరబోయే విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన పార్టీ మారబోతున్నట్టు తెలిసింది.ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదు. ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్లో చేరడం ఉత్తమమని నిర్ణయం తీసుకున్నారట. రమణ టీఆర్ఎస్లోకి వెళ్లబోతుండటంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే.
ఇక ఆ పార్టీలో ఒకరిద్దరు తప్ప ఎవరూ మిగల్లేదు. ప్రస్తుతం టీడీపీలో రావుల చంద్రశేఖర్రెడ్డి, నర్సిరెడ్డి, కొత్తకోట దయాకర్రెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు ఉన్నారు. వారు కూడా పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ టీడీపీని ఎప్పుడో వదిలేశారు. ఈక్రమంలో మిగిలిన వారు కూడా తలో దారి చూసుకోవడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీసీ నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడారు. దీంతో బీసీ సామాజికవర్గంలో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది. ఈ అసంతృప్తిని కొంతైనా చల్లార్చలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్.. రమణను టీఆర్ఎస్లో చేర్చుకోబోతున్నట్టు సమాచారం. రమణ చేరికతో బీసీల్లో ఉన్న అసంతృప్తి చల్లారుతుందా? ఆయన ఈటల స్థానాన్ని భర్తీ చేయగలరా? అన్న విషయం వేచి చూడాలి.