టీటీడీపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత బక్కని నరసింహులు ఎంపికయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. బక్కని నరసింహులు దళిత సామాజికవర్గానికి చెందిన నేత. 1994 నుంచి 99 వరకు ఆయన షాద్నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అనంతరం టీఆర్ఎస్లో చేరారు. దీంతో చంద్రబాబు బక్కని నరసింహులును పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.
ఈ పదవి కోసం నన్నూరి నర్సిరెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, కొత్తకోట దయాకర్రెడ్డి తదితరులను సంప్రదించారు. చివరకు సామాజిక సమీకరణాల దృష్ట్యా బక్కని నరసింహులుకు అవకాశం దక్కింది. బక్కని మొదటి నుంచి చంద్రబాబుకు నమ్మిన బంటుగా కొనసాగుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనం అయిన తర్వాత .. ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు పార్టీని వీడారు. కానీ బక్కని నరసింహులు చంద్రబాబునే నమ్ముకొని ఉన్నారు. దీంతో ఆయనకు ఈ పదవి దక్కింది.
Also Read: వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!
ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటికీ ఆ తర్వాత వారు టీఆర్ఎస్లో చేరారు. ఇక ఒకరిద్దరు మినహా చెప్పుకోదగ్గ నేతలు కూడా ఆ పార్టీలో లేరు. ఈ పరిస్థితుల్లో బక్కని పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.
Also Read: ‘భయం’ తెలియని వ్యక్తులే కాంగ్రెస్కు కావాలి..! రాహుల్ గాంధీ..!