దొడ్డి దారిన మంత్రిగా చెలామణి అవ్వడం కాదు. దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజా తీర్పులో విజయం సాధిస్తారా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ లోకేష్ ను గందరగోళంలోకి నెట్టిందనే చెప్పుకోవాలి.
2019 ఎన్నికల్లో ప్రత్యేక్ష ఎన్నికల్లో విజయం సాధించేలా లోకేష్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాను గెలవాలంటే ఏ నియోజకవర్గంలో ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయాలపై పార్టీ సీనియర్ నేతలతో, తండ్రి చంద్రబాబుతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో నారాలోకేష్ సులభంగా గెలిచే నియోజక వర్గాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే ఈ నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తారనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. పవన్ విసిరిన సవాల్ కు ధీటుగా సమాధానం చెప్పాలంటే లోకేష్ ఖచ్చితంగా గెలవాలి. మరి ఈ నేపథ్యంలో లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేలా విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. నారా లోకేష్ కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ చంద్రబాబుకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టంలేదని, కుప్పం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం. దీంతో లోకేష్ మరో నియోజక వర్గం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాయలసీమ నుంచి లోకేష్ ను బరిలోకి దింపితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ఈ చర్చల్లో రాయలసీమ ప్రాంతంలో వైసీపీ, జనసేన పార్టీలు బలంగా ఉన్నాయని, అక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచించారు. అయితే ఈ చర్చల్లో మరో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి.
లోకేష్ హిందూపురం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ నేతలు సలహా ఇచ్చారట. గత నాలుగేళ్లలో నియోజవకర్గానికి బాలకృష్ణ చేసింది ఏమీ లేదని,ఆయన కు పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అయినా ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి చినబాబు పోటీ చేస్తే బాగుంటుందని అన్నారట.
బాలకృష్ణ మళ్ళీ పోటీ చేస్తే, అతని విజయానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, లోకేష్ పోటీ చేస్తే పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పారట. ఇక బాలకృష్ణకు రాజ్యసభ సీటు, సాధ్యం కాకపోతే శాసన మండలికి నామినేట్ చేసేలా చంద్రబాబు భావిస్తున్నారట.