వైఎస్ జగన్ పై జరిగిన దాడి తెలుగురాష్ట్రాలతోపాటు యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో జగన్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో జగన్ ఎడమ చేతి భుజానికి గాయం అయ్యింది. తొమ్మిది కుట్లు కూడా పడ్డాయి. ఒక వేల కత్తి పోటు మెడకు తగిలింటే పరిస్థితి వేరేరకంగా ఉండేది.
ఈ ఘటన తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు జగన్ కుటుంబం రానుండటంతో ఏం మాట్లాడతారో ననే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఇప్పటి వరకు దాడికి సంబంధించి వైఎస్ జగన్ కానీ, తల్లి వైఎస్ విజయమ్మ,భార్య భారతీరెడ్డి, సోదరి షర్మిలలు ఎవరూ స్పందించలేదు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మాత్రం నేతలు మాత్రం ఘాటగా స్పందించారు.
జగన్ పై దాడి అతని కుటుంబ సభ్యులే చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను తప్పించేందుకు వైఎస్ విజయమ్మ, లేదా షర్మిలలే దాడి చేయించి ఉంటారని వ్యక్తిగతంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను వైసీపీతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్కూడా ఖండించారు. తల్లి ఎక్కడైనా కొడుకును చంపుతుందా అంటూ పవన్ కళ్యాణ్ఎ ద్దేవా చేశారు
వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్ జగన్ తల్లి విజయమ్మ రేపు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. జగన్ పై దాడి జరిగాక టీడీపీ నేతల వ్యవహారశైలి, ఎదురుదాడి సహా పలు అంశాలపై విజయమ్మ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే దాడి అనంతరం వైఎస్ జగన్ పాదయాత్రను ఈనెల 12 నుంచి ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం మక్కువ నుంచి జగన్ తన పాదయాత్రను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.