ఏపీలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలయ్యింది. అన్ని పార్టీలు ఎన్నికలు సై అంటె సై అంటున్నాయి. ఇప్పటికె చంద్రబాబు ముందస్తు ఎన్నికలు రావచ్చని ప్రకటించారు. రాజకీయ నేతల హడావుడి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్కూడా ముందస్తు ఎన్నికలపై కీలకవ్యుఖ్యలు చేయడంతో ఇప్పుడు రాజకీయాల్లో హాట్ హాట్గా మారింది.
లోటస్పాండ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నేతలతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అక్టోబర్ నెలలో ఎన్నికలు రావొచ్చునని ముహూర్తం కూడా చెప్పేశారు. పార్టీ శ్రేణులు ఏమరుపాటున ఉండవద్దని, సిద్ధం కావాలని హితవు పలికారు. 175 నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలంటూ పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు.
2018 అక్టోబర్ లోనే ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని… తన వద్ద ఉన్న సమాచారం కూడా అదేనని ఆయన అన్నారు. అక్టోబర్ లోనే ఎన్నికలు వస్తే మనకు మరీ మంచిదని… ఒకవేళ కొంచెం ఆలస్యమైనా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఎన్నికలకు పార్టీ క్యాడర్ మొత్తం సర్వసన్నద్ధంగా ఉండాలని… ఎలెక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
రెండో తేదీన పాదయాత్ర మొదలవబోతోందని… పాదయాత్ర కొనసాగే జిల్లాలో పార్టీ నేతలంతా సమష్టిగా పాల్గొనాలని సూచించారు. ఎన్నికల వరకు ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనదని… ప్రజాస్వామ్య యుద్ధానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దూకుతున్నారు. ఆయన కూడా ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని గతంలోనే ప్రకటించారు. చాలా రోజులుగా ముందస్తు మాట అందరి నేతల నోటి నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా వైసిపి అధినేత జగన్ నెలను కూడా చెప్పేశారు. వచ్చే అక్టోబర్ లోనే ఎన్నికలు రావొచ్చునని చెప్పారు.