అనంత పురంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతలో వైసీపీ బలోపేతం అవుతోంది. పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా గోరంట్ల సీఐ మాధవ్ జగన్ సమక్షంలో వైసీపీ ఖండువా కప్పుకున్నారు. ప్రభోధానంద స్వామి ఆశ్రమ విషయంలో టీడీపీఎంపీ జేసీ దివాకర్రెడ్డికి, సీఐ మాధవ్కు మధ్య గొడువ జరిగిన సంగతితెలిసిందే. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జేసీపై ఫైర్ అయ్యారు మాధవ్.
జేసీపై మీసం మెలేసి సంచలనం సృష్టించిన గోరంట్ల సీఐమాధవ్ వైసీపీలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన వైసీపీలో చేరుతారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ ఉద్దండుడు అయిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఢీ కొట్టి సీఐ గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాతోపాటు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే హల్ చల్ చేశారు.
సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని మాధవ్ను వైసీపీ హైకమాండ్ కోరడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేడు వైసీపీలో చేరారు. వైసీపీలో చేర్చుకోవాలని జిల్లా నేతలు జగన్పై ఒత్తిడి తీసుకొచ్చారు. సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే వైసీపీ ప్రతిపాదనపై మాధవ్ ఆసక్తి కనబరిచారు. జగన్ సూచించిన విధంగానే సీఐ పదవికి రాజీనామా చేశారు.
టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తానంటూ జేసీకి వార్నింగ్ ఇచ్చారు. తాము కూడా ప్రజలకు సేవచేసేందుకే పోలీసులమయ్యామని అంతేకాని రాజకీయ నాయకులకు ఊడిగం చేసేందుకు కాదని ఘాటుగా ఫైర్ అయ్యారు. మాధవ్ కానిస్టేబుల్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి అంచలంచెలుగా సీఐ వరకు ఎదిగారు. ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆ కమిట్మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. మరి రాజకీయాల్లో ఆయన జీవితం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.