ప్రత్యేక హోదా.. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా పోరాటం చేస్తోంది. ఆ పోరాటం ఇప్పుడు చట్టసభల దాకా వెళ్తోంది. ప్రత్యేక హోదా ప్రధాన నినాదంతో పార్లమెంట్లో పోరాటానికి జగన్ సేన సిద్ధమవుతోంది. ఆ పార్టీ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ఇచ్చేసింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానంతో జగన్కు, ఆ పార్టీకి చాలా లాభాలు ఉండనున్నాయి. మొదట దేశవ్యాప్తంగా జగన్కు మంచిపేరు వస్తుంది. రెండోది ప్రత్యేక హోదా ధ్యేయంగా తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని ప్రజలకు చెప్పడం. మూడోది పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ముగ్గురు ఎంపీలకు చుక్కలు చూపించడం. ఈ మూడో పాయింట్ చాలా ఆసక్తికరం కావడం.. పైగా టీడీపీలో ఆందోళనలు రగులుతున్నాయి. ఆ విషయమేమిటో చదవండి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలోకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. వాళ్లే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అరకు ఎంపీ కొత్తపల్లి గీత.
వీళ్లు తమ పార్టీ నుంచి గెలుపొంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాజీనామాలు చేయకుండా వెళ్లడం తెలిసిందే. వాళ్లు ఇంకా పదవులు అనుభవిస్తున్నారు. వాళ్లు తమ పదవులు వదులుకోవాలని కోరుతున్నా పట్టించుకోలేదు. దీంతో వారికి తగిన బుద్ధి చేసుకుందామని వైఎస్సార్సీపీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తుంది.
ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవిశ్వాసంతో వీరికి మూడినట్టే. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో ఆమోదం పొంది చర్చకు వస్తే మాత్రం వారి పదవులు వదులుకోవాల్సిన పరిస్థితే. దానికితోడు బుట్టా రేణుకపై ‘లాభదాయక పదవులు’ చట్టం ప్రకారం వేటు వేయాలంటూ పార్లమెంటరీ కమిటీ కూడా సిఫారసు కూడా చేసింది. పదవీ గండం పొంచి ఉంది.
మార్చి 21వ తేదీన కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోంది. వైఎస్సార్సీపీ 54 మంది ఎంపీల మద్దతు సంపాదిస్తే తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించాలి. అనుమతిస్తే ఈ ఎంపీల జాతకాలు మారిపోయే అవకాశం ఉంది.
చర్చ జరిగి తర్వాత ఓటింగ్ దాకా వస్తే వైఎస్సార్సీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేస్తారు. విప్ జారీ చేస్తే ఫిరాయింపు చేసిన ఎంపీలు కూడా వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఓటేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలి. అయితే వాళ్లు టీడీపీలో ఉండడంతో కేంద్రానికి మద్దతుగా ఓటేయాలి. ఒకవేళ కేంద్రానికి మద్దతుగా ఓటు వేస్తే ఆ ఎంపీలు వైఎస్సార్సీపీ విప్ను ధిక్కరించినట్టే. విప్ను ధిక్కరించారంటే రాజ్యాంగ ప్రకారం వారిపై సస్పెన్షన్ పడుతుంది. వెంటనే వాళ్లు ఎంపీ పదవులను వదుకోవాల్సిన పరిస్థితి.
పార్లమెంటు రికార్డుల ప్రకారం ఆ ముగ్గురు ఎంపీలు వైఎస్సార్సీపీకి చెందినవారే. వైఎస్సార్సీపీ ఆదేశాల ప్రకారం వారు ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఫిరాయింపు ఎంపీలు ఆందోళనకు గురవుతున్నారు. విరుగుడుగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఓటింగ్ జరిగితే ఆ రోజుకు తమకు అనారోగ్యంగా ఉందని చెప్పి ఆస్పత్రిలో చేరడమో లేకపోతే అసలు దేశంలోనే లేమనో ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ఆలోచన చేయాలి. మొత్తానికి అవిశ్వాస తీర్మానం రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాల్సిందే.